Rajinikanth: మనం ఇటలీ పరిస్థితి తెచ్చుకోకూడదంటూ రజనీకాంత్ ట్వీట్.... వీడియో తొలగించిన ట్విట్టర్

  • కరోనా మూడో దశకు వెళ్లకుండా ఉండేందుకే జనతా కర్ఫ్యూ అన్న రజనీ
  • ఇటలీలో రెండో దశలో ఉన్నప్పుడు కర్ఫ్యూ ఆదేశాలిచ్చారని వెల్లడి
  • అక్కడి ప్రజలు పాటించకపోవడంతో వేల మరణాలు సంభవించాయన్న రజనీ
Rajinikanth tells people do not do like Italians

కరోనా నేపథ్యంలో ప్రజలనుద్దేశించి తలైవా రజనీకాంత్ చేసిన ఓ వీడియో ట్వీట్ ను ట్విట్టర్ నిర్వాహకులు తొలగించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి మన దేశంలో రెండో దశలో ఉందని, దాన్ని మూడో దశకు వెళ్లకుండా నిరోధించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని రజనీ వీడియో సందేశం వెలువరించారు.

ఇటలీ దేశంలో కరోనా సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కర్ఫ్యూ పాటించాలని ఆదేశాలిచ్చినా, అక్కడి ప్రజలు నిర్లక్ష్యం చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ రజనీ పేర్కొన్నారు. ఇటలీ ప్రజల్లా మనం అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని, జనతా కర్ఫ్యూని విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ఇటలీ ప్రజల్లా నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. అయితే ట్విట్టర్ ఈ వీడియోను తొలగించింది.

కాగా, రజనీకాంత్ ట్వీట్ ను ట్విట్టర్ తొలగించడానికి గల కారణం ఆయన ఓ అంశాన్ని తప్పుగా పేర్కొనడమేనని తెలిసింది. కరోనా వైరస్ మహమ్మారి జీవితకాలం 12 గంటలు కాగా, ఆయన తన సందేశంలో 14 గంటలు అని పేర్కొన్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ట్విట్టర్ భావించి ఆయన వీడియోను తొలగించింది.

More Telugu News