Corona Virus: ఇటలీని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 793 మంది మృతి!

  • ఇటలీపై పగబట్టిన కరోనా మహమ్మారి
  • రెండు రోజుల్లో 1420 మంది మృతి
  • మృతుల్లో 3 వేల మంది ఉత్తర లోంబార్డీ ప్రాంత వాసులే
793 people died in Italy in 24 hours over corona virus

కరోనా మహమ్మారి ఇటలీపై పగబట్టింది. జనాల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. మహోగ్ర రూపంతో విరుచుకుపడుతోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 793 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ వైరస్ వెలుగు చూసిన తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. తాజా మరణాలతో ఇటలీలో మృతుల సంఖ్య 4,825కు చేరింది. కరోనా వెలుగుచూసిన చైనాలోనూ ఇంతకంటే తక్కువ మరణాలు నమోదు కావడం గమనార్హం.

చైనాలో ఇప్పటి వరకు 3255 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే ఇటలీలో 1420 మంది ప్రాణాలు కోల్పోయారు. మిలన్ నగర సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే ఏకంగా 3000 మంది మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తోంది.

More Telugu News