npr: జనాభా లెక్కలు, ఎన్‌పీఆర్​పై కరోనా ప్రభావం

  • ఏప్రిల్ 1 నుంచి వివిధ ప్రాంతాల్లో మొదలవ్వాల్సిన ప్రక్రియ
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసే అవకాశం
  • ప్రస్తుత పరిస్థితుల్లో జన గణన వద్దంటూ కేంద్రానికి పలు రాష్ట్రాల లేఖలు
 Govt may defer Census and NPR update due to Coronavirus impact

జనాభా లెక్కలు, జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్) అప్‌డేట్‌ ప్రక్రియకు కరోనా వైరస్ వ్యాప్తి అడ్డు తగిలేలా ఉంది. దేశంలో కరోనా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రారంభ తేదీని వాయిదా వేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన జన గణన, ఎన్‌పీఆర్ అప్‌డేట్‌ ప్రక్రియను సెంట్రల్ ఢిల్లీ, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌, మేఘాలయ నుంచి ప్రారంభించాల్సి ఉంది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితి నెలకొనడంతో జనాభా లెక్కలను వాయిదా వేయాలంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి లెక్కలు సేకరించడం వల్ల  వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రక్రియను వాయిదా వేస్తే మంచిదని సూచించారు.

జన గణన, ఎన్‌పీఆర్ ప్రక్రియ షెడ్యూల్‌పై కేంద్ర హోంశాఖ ప్రస్తుతం మౌనం పాటిస్తోంది. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే  ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, స్థానిక అధికారులు ప్రతి గడపకు వెళ్లి లెక్కలు సేకరించడం అంటే వారితో పాటు ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి  నెట్టినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి వాయిదా వేసినా తుదిగడువు అయిన సెప్టెంబర్ నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి  చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More Telugu News