Americans: నిండుకున్న టాయిలెట్ పేపర్లు.. భారత్‌ను అనుసరిస్తున్న పాశ్చాత్యులు!

  • అమెరికా మాల్స్‌లో కనిపించని టాయిలెట్ పేపర్లు
  • నీటిని ఉపయోగించుకుంటున్న అమెరికన్లు
  • ప్రపంచ మేధావులందరూ పైపులు కొనుక్కోవాలని సూచన
American using water instead of toilet papers

అవసరం మనిషితో ఎంతపనైనా చేయిస్తుందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా భయం ప్రపంచాన్ని ఒక్కటి చేసింది. కులమతభేదాలు మర్చిపోయేలా చేసింది. అక్కడితో ఆగలేదు అలవాట్లు, కట్టుబాట్లను కూడా మార్చేస్తోంది. సాధారణంగా అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు కాలకృత్యాల కోసం మనలా నీళ్లు వాడకుండా టాయిలెట్ పేపర్లు వాడతారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ముందు  జాగ్రత్త చర్యలు చేపట్టిన చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశాయి.

దీంతో అమెరికా, బ్రిటన్ ప్రజలు నిత్యవసరాలతోపాటు టాయిలెట్ పేపర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టుకున్నారు. దీంతో దేశంలోని అన్ని స్టోర్లలోనూ అవి నిండుకున్నాయి. అమెరికాలో అయితే టాయిలెట్ పేపర్ల కోసం దోపిడీలు కూడా జరుగుతున్నాయి. దీంతో వాటిని రక్షించుకునేందుకు ప్రజలు తుపాకుల కొనుగోలు చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మరోవైపు, టాయిలెట్ పేపర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. చాలామంది తమ బాత్రూంలలో పైపులు బిగించుకుని టాయిలెట్ పేపర్లకు బదులు నీటిని ఉపయోగిస్తున్నారు. చికాగోకు చెందిన 28 ఏళ్ల స్కాక్ బ్రామే ఓ పైపును కొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘‘అమెరికా మేధావుల్లారా.. టాయిలెట్ పేపర్లను కొనడం కంటే ఓ చిన్న నీటి పైపును కొనుక్కోండి చాలు’’ అని క్యాప్షన్ తగిలించాడు.

More Telugu News