Soldier: భారత సైన్యంలో తొలి కేసు నమోదు.. జవానుకు కరోనా పాజిటివ్

  • లడాక్ స్కౌట్స్ లో పని చేస్తున్న జవాను
  • ఫిబ్రవరి 27న ఇరాన్ నుంచి వచ్చిన జవాను తండ్రి
  • కుటుంబం మొత్తం క్వారంటైన్ కు తరలింపు
Indian soldier tested corona positive

మన దేశంలో స్టేజ్-2కు చేరుకున్న కరోనా వైరస్ నెమ్మదిగా తన ప్రభావాన్ని పెంచుతోంది. దేశంలో ఇప్పటి వరకు 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ మహమ్మారి భారత సైన్యానికి కూడా విస్తరించింది. ఇండియన్ ఆర్మీలో తొలి కేసు నమోదైంది. లడాక్ స్కౌట్స్ (స్నో వారియర్స్) విభాగానికి చెందిన ఒక జవానుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను క్వారంటైన్ కు తరలించారు. ఫిబ్రవరి 27న సదరు జవాను తండ్రి ఇరాన్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా సాధారణ సెలవుపై ఇంటి వద్ద ఉన్న జవాను తన తండ్రితో గడిపారు.

జవాను తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి క్వారంటైన్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ అనే విషయం మార్చి 6న తెలిసింది. ఆ మరుసటి రోజు సదరు జవానును కూడా ఐసొలేషన్ కు తరలించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అనే విషయం గత సోమవారం తెలిసింది. దీంతో, ఆయనను కూడా క్వారంటైన్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు, ఒక సోదరిని కూడా ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు.

More Telugu News