USA: అమెరికా సంచలన నిర్ణయం... వడ్డీ రేటు ఇక సున్నా శాతం!

  • కరోనా కట్టడికి కదిలిన యూఎస్ ఫెడ్
  • ఇప్పటికే దిగజారిన యూఎస్ ఎకానమీ
  • అదనంగా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులు
  • వెల్లడించిన ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్
US Fed Cuts Interest Rates to Zero

కరోనా వైరస్ విశ్వవ్యాప్తమై, గడగడలాడిస్తున్న వేళ, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయిలో 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం నాడు అత్యవసరంగా సమావేశమైన యూఎస్ పెడ్, కరోనా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.

2008లో లీమన్ బ్రదర్స్ దివాలా తరువాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, అమెరికా వడ్డీ రేట్లను సున్నా శాతానికి మార్చింది. ఆపై మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులను వెచ్చించనున్నట్టు కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు.

యూఎస్ ఫెడ్ నిర్ణయంతో రిటైల్ ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేసినప్పటికీ, నాస్ డాక్, డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం చతికిలపడ్డాయి. ఈ ప్రకటన రాగానే, తదుపరి సెషన్ లో 5 శాతం వరకూ పతనం ఉండవచ్చన్నట్టుగా మార్కెట్ సూచీలు చూపుతున్నాయి.

More Telugu News