Corona Virus: కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి... జరిగేది ఇదే!

  • ఐదు రోజుల తరువాత కనిపించే లక్షణాలు
  • పది రోజులు దాటేసరికి ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్
  • ఆపై రక్తంలోకి పాకి ప్రాణాపాయ స్థితి
Special Article On Vorona Virus in Lancet Journal

ప్రపంచాన్ని భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? ఎలాంటి ప్రభావం కనిపిస్తుందన్న అంశాలపై లాన్సెట్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులోని వివరాల ప్రకారం, ఈ వైరస్ సోకిన తరువాత తొలి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటకు కనిపించవు. కొందరిలో 14 రోజుల పాటు ఏ మార్పులూ నమోదు కావు. ఒకసారి ప్రభావం కనిపించడం ప్రారంభమైన తరువాత...

తొలి మూడు రోజులు ఒళ్లు వెచ్చబడుతుంది. ఆపై గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే కనిపించాయి. ఇక, నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజు లోగా, వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. ఊపిరి అందడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి. బాధితుల్లో ఈ దశను ఎదుర్కొన్న వారు 14 శాతం మంది.

ఆపై పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్‌ ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటె న్సివ్‌ కేర్‌ చికిత్స తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి ఈ పరిస్థితికి వచ్చిన వారు 5 శాతం వరకూ ఉన్నారు. ఇక వీరిలో రోగ నిరోధక శక్తి బాగుండి, ఇతర జబ్బులు లేకుంటే, కరోనాను సులువుగా జయించవచ్చు. బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితరాలు ఉన్నా, 60 ఏళ్లు దాటినా కరోనా వారికి పెనుముప్పుగానే పరిణమిస్తుంది.

More Telugu News