Ice Cream: దేశ రాజధానిలో హత్యకు దారితీసిన ఐస్ క్రీమ్ బిల్లు

  • ఎంబీబీఎస్ పూర్తి చేసిన లక్షయ్ అనే యువకుడు
  • సోదరుడు, ఫ్రెండ్స్ తో ఐస్ క్రీమ్ పార్లర్ కు వచ్చిన లక్షయ్
  • ఆ పార్లర్ లో ఇతరుల బిల్లు కూడా తానే చెల్లిస్తానని పట్టు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన మరో వ్యక్తి
Ice Cream bill causes a man death in Delhi

ఢిల్లీ శివారు ప్రాంతం రోహ్నీలో ఓ వ్యక్తి తిన్న ఐస్ క్రీమ్ కు మరో యువకుడు బిల్లు చెల్లిస్తానన్న ఘటన హత్యకు దారితీసింది. ఎంబీబీఎస్ విద్యార్థి లక్షయ్ చదువు పూర్తి కావడంతో తన సోదరుడు, మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో ఐస్ క్రీమ్ పార్లర్ కు వచ్చాడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తమ బిల్లుతో పాటు అక్కడే ఐస్ క్రీమ్ తింటున్న ఇతరుల బిల్లు కూడా చెల్లిస్తానని తెలిపాడు. తన ఆనందాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలన్నది లక్షయ్ ప్రయత్నం.

అయితే, అక్కడే తన ఫ్రెండ్స్ తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న అమిత్ శర్మ అనే వ్యక్తి దీన్ని వ్యతిరేకించాడు. తమ బిల్లు తామే చెల్లిస్తామని చెప్పడంతో లక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో అమిత్ శర్మ, అతని ఫ్రెండ్స్ కూడా గొడవకు దిగారు. అక్కడున్నవారు సర్దిచెప్పడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అయితే అర్ధరాత్రి తర్వాత లక్షయ్ బృందం అమిత్ శర్మపై దాడి చేసింది. బలమైన దెబ్బలు తగలడంతో అమిత్ శర్మ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేయగలిగారు.

More Telugu News