Corona Virus: 145 దేశాలపై కరోనా పడగ.. లక్షన్నరకు చేరిన బాధితులు!

  • ఇప్పటి వరకు 5423 మంది మృత్యు ఒడిలోకి 
  • చైనాలో తగ్గుముఖం పట్టి యూరప్ కు విస్తరణ 
  • ఇంటి నుంచి సేవలందించాలని ఉద్యోగులకు ఐరాస కార్యాలయం ఆదేశం
corona affected 145 countries in the world

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 145 దేశాలకు విస్తరించింది. చైనాలో మొదలైన ఈ వైరస్ అక్కడ కాస్త అదుపులోకి వచ్చినా యూరప్ దేశాలకు బాగా విస్తరించి భయపెడుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రకటించడం గమనార్హం. ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు తమ సేవలను ఇంటి వద్ద నుంచే అందించాలని ఐరాస కార్యాలయం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1,45,631 మందికి చేరింది. ముఖ్యంగా ఇటలీలో పరిస్థితి తీవ్రంగా ఉంది.

నిన్న ఒక్కరోజే 250 మంది చనిపోగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1266కు చేరింది. కొత్తగా 2500 మందికి వైరస్ సోకగా, బాధితుల సంఖ్య 17,00ను దాటింది. ఇరాన్లో 514 మంది, స్పెయిన్లో 133 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్ లోను పరిస్థితి తీవ్రమవుతోంది.

ఇప్పటి వరకు 150 మంది బాధితులను గుర్తించారు. లాటిన్ అమెరికా దేశాలైన ఈక్విడార్ లో నిన్న తొలి మరణం సంభవించింది. వెనిజులా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్ దేశాల్లో తొలి కేసులు నమోదు కావడం విశేషం. అమెరికాలో పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనాలో ఇప్పటి వరకు 3.189 మంది చనిపోగా నిన్న 13 మంది మృతి చెందారు.

అయితే కొత్తగా వైరస్ సోకుతున్న వారి సంఖ్య బాగా అదుపులోకి వచ్చింది. మరోవైపు దక్షిణ కొరియాలోనూ వైరస్ అదుపులోకి వస్తోంది. ఈ దేశంలోనూ కొత్త బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆదేశం ఊపిరి పీల్చుకుంటోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు 67 మంది చనిపోగా, నిన్న కొత్తగా 107 మందికి వైరస్ సోకింది. 

More Telugu News