Telangana: గుడ్‌న్యూస్! కరోనా నుంచి కోలుకున్న హైదరాబాద్ టెకీ.. ‘గాంధీ’ నుంచి డిశ్చార్జ్

  • దుబాయ్ నుంచి వచ్చిన బాధితుడు
  • ఈ నెల 1న గాంధీ ఆసుపత్రిలో చేరిన టెకీ
  • ఊపిరి పీల్చుకున్న నగర వాసులు
Hyderabad techie discharged from Gandhi Hospital

కరోనా భయంతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు ఇది గుడ్‌న్యూసే. కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన హైదరాబాద్‌కు చెందిన టెకీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. హైదరాబాద్‌లోని మహీంద్రాహిల్స్‌కు చెందిన టెకీ ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ నెల 1న కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు.

తొమ్మిది రోజుల చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఐదు రోజుల క్రితం మరోమారు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రిపోర్టులు నెగటివ్ అని వచ్చాయి. అయితే, మరింత స్పష్టత కోసం నమూనాలను పూణె ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా నెగటివ్ అని రావడంతో నిన్న రాత్రి అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ వార్త తెలిసిన నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

డిశ్చార్జ్ అయినప్పటికీ మరో 14 రోజులపాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ వైరస్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. వైరస్ సోకిన అందరూ ప్రాణాలు కోల్పోతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

More Telugu News