Kadiri Baburao: నమ్మకం ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట: కదిరి బాబూరావు విమర్శలు

  • చంద్రబాబుకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరాను
  • దర్శి నుంచి పోటీ చేయనని చెప్పినా బలవంతంగా చేయించారు
  • ఎమ్మెల్సీ లేదా కనిగిరి ఇన్ చార్జి పోస్టో ఇస్తానని చెప్పి మోసం చేశారు
Ysrcp leader Kadiri Babu Rao lashes out chandrababu

నమ్మకం ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయనకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. వైసీపీలో చేరిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏవో పదవులు ఆశించి వైసీపీలోకి తాను వెళ్ల లేదని, చంద్రబాబు లాంటి ద్రోహి దగ్గర ఉండకూడదనే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు.

తాను మొట్టమొదటిసారిగా ఓటు వేసింది తెలుగుదేశం పార్టీకి అని, టీడీపీ ఆవిర్భావం నుంచి ఇదే పార్టీలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. 2014లో టీడీపీ తరఫున కనిగిరి నియోజకవర్గం నుంచి పన్నెండు వేల మెజార్టీతో గెలిచానని, ఆ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని అన్నారు. అలాంటిది, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనను దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారని, కనిగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పినా తన మాటలు పట్టించుకోలేదని చంద్రబాబుపై విమర్శలు చేశారు.

కొన్ని పత్రికల అధిపతులతో తనకు ‘ఆబ్లిగేషన్స్’ ఉన్నాయని చెప్పిన చంద్రబాబు తనను దర్శి నుంచే పోటీ చేయించారని విమర్శించారు. ఒకవేళ దర్శి నుంచి తాను ఓడిపోతే తనకు ఎమ్మెల్సీ పదవో, లేకపోతే, కనిగిరి టీడీపీ ఇన్ చార్జి పోస్టో ఇస్తానని నాడు చంద్రబాబు చెప్పారని, ఈ విషయమై అడిగినా ప్రతిసారీ బాబు మాట దాటవేసేవారని దుయ్యబట్టారు.

More Telugu News