India: మరోసారి విధ్వంసాన్ని చూపిన సచిన్, సెహ్వాగ్!

  • ముంబయి లోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
  • వెస్టిండీస్ లెజండ్స్ తో తలపడిన ఇండియా లెజండ్స్
  • 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం
Sachin and Sehwag Batting in Wankhade Stadium

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్... వీరిద్దరూ ఓపెనింగ్ జోడీగా క్రికెట్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అనంతరం, ఇద్దరూ అవుట్ అయ్యేంత వరకూ ప్రత్యర్థి జట్టుకు తమ విజయంపై ఏ మాత్రం ఆశ ఉండేది కాదనడంలో అతిశయోక్తి లేదు. అంతగా ప్రభావం చూపిన జంట ఇది. కానీ, వీరిద్దరూ ఆటకు దూరమై చానాళ్లయింది. మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి మైదానంలోకి దిగారు. అంతేకాదు, తమలో ఏ మాత్రమూ సత్తా తగ్గలేదని చెబుతూ విధ్వంసకర బ్యాటింగ్ ను చూపించారు. ఈ ఆటకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది.

సరిగ్గా 9 సంవత్సరాల నాడు, తాను ఎక్కడైతే చివరి క్రికెట్ మ్యాచ్ ని ఆడాడో, అక్కడే సచిన్ తిరిగి బ్యాటు అందుకున్నాడు. తోడుగా సెహ్వాగ్ ఉండనే ఉన్నాడు. ఇంకేముంది మైదానం చిన్నబోయింది. అసంఖ్యాకంగా హజరైన ప్రేక్షకులు "సచిన్... సచిన్..." అంటూ నినాదాలు చేస్తుంటే సెహ్వాగ్ తో కలిసి రెచ్చిపోయారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజండ్స్ జట్టులో చందర్ పాల్ 61 పరుగులతో రాణించడంతో, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆపై 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజండ్స్ లో తొలి వికెట్ కు సచిన్, సెహ్వాగ్ కలిసి 83 పరుగులు సాధించడం గమనార్హం. సచిన్ 29 బంతుల్లోనే 7 ఫోర్లతో 36 పరుగులు చేయగా, సెహ్వాగ్ 57 బంతుల్లో 11 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. దీంతో ఇండియా లెజండ్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

More Telugu News