Facebook: కరోనా భయంతో లండన్ లో కార్యాలయాలు మూసేసిన ఫేస్ బుక్

  • సింగపూర్ నుంచి లండన్ వచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగి
  • లండన్ లోని ఫేస్ బుక్ కార్యాలయాల సందర్శన
  • ఉద్యోగికి కరోనా ఉన్నట్టు వైద్యపరీక్షల్లో వెల్లడి
  • సోమవారం వరకు కార్యాలయాలు మూసేస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రకటన
  • ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశం
Facebook decides to close London offices due to corona fears

ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా అనేక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. తాజాగా, ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ లండన్ లోని తన కార్యాలయాలను కరోనా భయంతో మూసేసింది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ఉద్యోగి లండన్ లోని ఫేస్ బుక్ కార్యాలయానికి వచ్చాడు. అతడికి ఇప్పుడు కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఫేస్ బుక్ యాజమాన్యం తీవ్ర ఆందోళన చెందుతోంది. అతడు లండన్ కార్యాలయాలను సందర్శించడంతో ఇతర ఉద్యోగులకు కూడా కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని భయపడుతోంది.

అందుకే సోమవారం వరకు లండన్ లోని తమ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ లోపు ఆఫీసులను రసాయనాలతో శుద్ధి చేయనున్నారు. అప్పటివరకు తన ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. సింగపూర్ నుంచి వచ్చిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఇకమీదట కొన్నాళ్ల పాటు ఇతరులతో కలవరాదని, తమ ఆరోగ్య లక్షణాలను నిశితంగా గమనిస్తుండాలని ఫేస్ బుక్ పేర్కొంది. అటు, అమెరికాలో బే ఏరియాలోనూ తన ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని ఫేస్ బుక్ ఆదేశించింది.

More Telugu News