KCR: అసత్య ఆరోపణలు చేయడం ‘కాంగ్రెస్​’కు అలవాటు: సీఎం కేసీఆర్​

  • ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదు
  • అసత్య ఆరోపణలు ఆపడానికే సభ నుంచి వారిని సస్పెండ్ చేశాం
  • కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది
Telangana CM Kcr Fires on Congress

ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదని, అసత్య ఆరోపణలు చేయడం ఈ పార్టీకి అలవాటని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అసత్య ఆరోపణలను ఆపడానికే సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశామని చెప్పారు. సభను ఇంత ఘోరంగా తప్పుదోవపట్టిస్తున్న సభ్యులు సభలో ఉండటానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.

ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడటం వల్లే తాము గెలిచామని కాంగ్రెస్ ఆరోపణలు తగదని, బ్యాలెట్ పేపర్ తో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32కు 32 స్థానాలు గెలిచామని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం కనుకనే ఎన్నిక ఏదైనా తమకే ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందని,  దేశ వ్యాప్తంగా నాలుగు శాతం ఓట్లకే ఈ పార్టీ పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చక్కగా గెలిచినట్టు, తాము గెలిస్తే పైసలిచ్చి గెలిచినట్టా? అని ప్రశ్నించారు.

More Telugu News