Tirumala: తిరుమలకు వెల్లువలా భక్తులు... ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

Heavy Rush in Tirumala
  • వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు
  • వారాంతం కలిసిరావడంతో పెరిగిన భక్తుల సంఖ్య
  • నిన్న దర్శించుకున్న 68 వేల మంది
గడచిన నాలుగైదు రోజులుగా వెలవెలబోయిన తిరుమల గిరులు, వారాంతం వచ్చేసరికి ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. నిన్న రాత్రి నుంచి వెల్లువలా భక్తులు రావడంతో, అద్దె గదులకు కొరత ఏర్పడింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 గదుల్లో భక్తులు స్వామి వారి సర్వదర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శనమయ్యేందుకు కనీసం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మిగతా అన్ని రకాల దర్శనాలకూ 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. 

కాగా, తిరుమలలో వెంకన్న తెప్పోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలు నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం పుష్కరిణిలో స్వామివారు శ్రీ కృష్ణుని అవతారంలో విహరించనున్నారు. నిన్న స్వామివారిని సుమారు 68 వేల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 2. 75 కోట్ల మేరకు ఆదాయం లభించింది.
Tirumala
Tirupati
TTD
Piligrims
Rush

More Telugu News