SBI Cards: ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ అదిరింది.. బ్రహ్మరథం పట్టిన మదుపరులు!

  • సోమవారం ప్రారంభమైన ఐపీఓ
  • రూ. 10 వేల కోట్లు కావాలంటే రూ. 2 లక్షల కోట్లకు బిడ్లు
  • 22.45 రెట్లు అధిక స్పందన
Block buster IPO for SBI Cards

ఈ వారం ప్రారంభంలో తొలిసారిగా నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్ ను ఆశ్రయించిన, దేశంలోని అతిపెద్ద బ్యాకింగ్ సేవల ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ అనుబంధ ఎస్బీఐ కార్డ్స్ కు మదుపుదారులు బ్రహ్మరథం పట్టారు. ఓ వైపు కరోనా ప్రభావంతో మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నప్పటికీ, ఈ ఐపీఓలో భాగస్వాములయ్యేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. మాతృసంస్థ ఎస్బీఐ బలమైన ఆర్థిక మూలాలను కలిగివుండటంతో, తమ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని ఇన్వెస్టర్లు నమ్మారని మార్కెట్ పండితులు వ్యాఖ్యానించారు.

ఇష్యూ సైజ్ కు మించి 22.45 రెట్ల బిడ్లు దాఖలు కావడం ఈ ఐపీఓ విశేషం. గత నెల 29న 74 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,769 కోట్లు సేకరించిన ఎస్బీఐ కార్డ్స్, ఆపై రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2 వ తేదీన బిడ్లను ఆహ్వానించింది. ఈ ఇష్యూ గురువారంతో ముగియగా, ఈ మధ్య కాలంలో ఏ ఐపీఓకూ రానంతటి స్పందన వచ్చింది.

ఎస్బీఐ కార్డ్స్‌ లో ప్రస్తుతం ఎస్బీఐకి 76 శాతం వాటా ఉంది. రూ. 750 నుంచి రూ. 755 మధ్య ఇష్యూ ధరతో రూ. 10,355 కోట్లను సమకూర్చుకోవాలని సంస్థ భావించగా, 22 రెట్లకు పైగా అధిక బిడ్లు వచ్చాయి. అంటే, దాదాపు రూ. 2 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఇన్వెస్టర్లు సిద్ధమయ్యారన్నమాట. ఇక బిడ్లు దాఖలు చేసిన వారిలో లక్కీ డిప్ ద్వారా వాటాలను సంస్థ జారీ చేయనుంది. ఈ సంస్థ మూడో వారం నుంచి స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానుంది.

More Telugu News