Corona Virus: కరోనా కేసుల వివరాలను వెల్లడించొద్దని వైద్యులకు ఆదేశాలు.. గాంధీ ఆసుపత్రిలో మీడియాకు నో ఎంట్రీ!

  • తెలంగాణలో ఇప్పటి వరకు 457 కరోనా అనుమానిత కేసులు
  • గాంధీ ఆసుపత్రి వద్ద పలు ఆంక్షల విధింపు
  • నిన్న అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రికి చేరిన మరో అనుమానిత కేసు
No entry for media in to Gandhi Hospital

తెలంగాణను కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. అనుమానిత కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 457 అనుమానిత కేసులు నమోదైనట్టు సమాచారం. నిన్న ఒక్క రోజే ఏకంగా 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నమోదు కావడం గమనార్హం. ఎయిర్ పోర్టులో ఇప్పటి వరకు 18,224 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహించారు.

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో, ఆసుపత్రి ప్రాంగణంలో పలు ఆంక్షలను విధించారు. కేసుల వివరాలను బయటకు వెల్లడించవద్దని వైద్యులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మాత్రమే కరోనాపై అప్ డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఆసుపత్రి వద్ద మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఇకపై ఆసుపత్రి ఆవరణలోకి మీడియాకు అనుమతి లేదు. మీడియా వాహనాలను ఇక్కడి నుంచి తరలించాలని, మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.

మరోవైపు గాంధీ ఆసుపత్రికి నిన్న అర్ధరాత్రి మరో కరోనా అనుమానిత కేసు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆయన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అర్ధరాత్రి 1.55 నిమిషాలకు అతడిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు.

More Telugu News