India: ఢిల్లీ హింసపై ఇరాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు

  • అల్లర్లపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసిన జావెద్‌ జరీఫ్‌
  • ముస్లింలపై వ్యవస్థీకృత హింసగా వర్ణించిన ఇరాన్ మంత్రి 
  • తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
India Summons Iran Envoy After Foreign Ministers Tweet On Delhi Violence

ఢిల్లీ అల్లర్లపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఢిల్లీలోని ఆ దేశ రాయబారి అలీ చెగేనికి భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్లపై జరీఫ్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా, ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని కేంద్రం తెలిపింది. తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్‌కు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని చెగేనికి తేల్చిచెప్పిందని సమాచారం.

ఢిల్లీ అల్లర్ల గురించి సోషల్ మీడియాలో స్పందించిన ఇరాన్‌ మంత్రి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తెలివిలేని హింస జరగకుండా భారత అధికారులు జాగ్రత్తపడాలని అన్నారు. మరో అడుగు ముందుకేసి ‘భారత ముస్లింలపై జరిగిన వ్యవస్థీకృత హింసను ఇరాన్ ఖండిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ.. ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారికి సమన్లు ఇచ్చింది. కాగా, సున్నిత అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు చేయొద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలను భారత విదేశాంగ శాఖ గతవారమే విజ్ఞప్తి చేసింది.

More Telugu News