NewZealand: భారత్ ఢమాల్.. రెండో రోజు కివీస్​ దే ఆధిపత్యం

  • 165 పరుగులకే ఆలౌటైన కోహ్లీసేన
  • న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 216/5
  • రాణించిన కేన్  విలియమ్సన్
  • 51 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు
New Zealand take lead on India

మొదటి రోజు టాపార్డర్ విఫలమైతే.. రెండో రోజు మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఫలితంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబాటు కొనసాగుతోంది. చివర్లో మన బౌలర్లు పుంజుకున్నా వరుసగా రెండో రోజు కూడా న్యూజిలాండే పైచేయి సాధించింది. భారత్ ను 165 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్ శనివారం ఆట చివరకు తొలి ఇన్నింగ్స్ లో 216/5తో నిలిచింది. ఇప్పటికే 51 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఆకట్టుకున్న విలియమ్సన్

కేన్ విలియమ్సన్ (89) కెప్టెన్  ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా, వందో టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (44)  రాణించాడు. ఓపెనర్ టామ్ లాథమ్ (11)ను ఇషాంత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చినా.. మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ (30), టేలర్ తో  విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన విలియమ్సన్  ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు.

మూడు వికెట్లు తీసినా..

ఓ దశలో 166/2తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ఆ జట్టు జోరుకు భారత బౌలర్లు బ్రేకులేశారు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసి పుంజుకున్నారు. టేలర్ ను ఔట్ చేసిన ఇషాంత్ మూడో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసి బ్రేక్ ఇవ్వగా.. విలియమ్సన్‌ ను ఇషాంత్, నికోల్స్ (17)ను అశ్విన్ వెనక్కు పంపారు. ప్రస్తుతం బీజే వాట్లింగ్ (14 బ్యాటింగ్), గ్రాండ్ హోమ్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇషాంత్ కు మూడు, షమీ, అశ్విన్ కు ఒక్కో వికెట్ దక్కింది.

13 ఓవర్లలోనే ఖేల్  ఖతం

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 122/5తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 68.1 ఓవర్లో 165 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలింగ్ ధాటికి 13 ఓవర్లలోనే మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట మొదలైన వెంటనే రిషబ్ పంత్ (19) రనౌటవగా.. అశ్విన్ (0) గోల్డెన్ డకౌటయ్యాడు. అతడిని  సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మహ్మద్ షమీ (21) సహకారంతో ఒక్కో పరుగు జోడిస్తూ హాఫ్ సెంచరీకి చేరువైన అజింక్యా రహానే (46)ను కూడా సౌథీనే వెనక్కు పంపాడు. ఆపై, వరుస ఓవర్లలో ఇషాంత్  (5)ను జెమీసన్, షమీని సౌథీ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో జెమీసన్, సౌథీ  చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

More Telugu News