Amazon India: అమెజాన్‌నే బోల్తా కొట్టించిన జగిత్యాల యువకుడు.. రూ.8 లక్షలు ముంచిన వైనం!

  • అమెజాన్‌లో రూ. 8 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసిన అరుణ్
  • వివిధ కారణాలతో తిప్పి పంపిన వైనం
  • మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమెజాన్
Amazon files case against Jagityal youth

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియానే బోల్తా కొట్టించాడో యువకుడు. విలువైన వస్తువులను ఆర్డర్ చేసి ఆ తర్వాత వివిధ కారణాలతో వాటిని తిప్పి పంపేవాడు. అయితే, అలా పంపినవి నకిలీవని తేలడంతో అమెజాన్ విస్తుపోయింది. మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని జగిత్యాలలో జరిగిందీ ఘటన.
 
పట్టణానికి చెందిన అరుణ్.. అమెజాన్ సైట్ ద్వారా విలువైన వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత వివిధ కారణాలు చూపి అసలు వస్తువులను తన వద్ద ఉంచుకుని నకిలీలను రిటర్న్ చేసేవాడు. ఇలా మొత్తంగా రూ.8 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి నకిలీ వస్తువులను తిప్పి పంపాడు. ఒకే వ్యక్తి నుంచి ఎక్కువగా రిటర్న్ వస్తుండడంతో అనుమానించిన అమెజాన్ వెనక్కు వచ్చిన వాటిని పరిశీలించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అమెజాన్ లీగల్ టీం అరుణ్‌పై జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News