Jagtial District: 'చించావ్ లే పో' అంటూ రష్మిక మందన్నకు జగిత్యాల కలెక్టర్ పేరిట కామెంట్.. మండిపడిన నెటిజన్లు!

  • బాధ్యతాయుత అధికారికి ఇది తగదని విమర్శ
  • నా ఖాతా హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు
  • కార్యాలయ సిబ్బంది ఇద్దరిపై వేటు
collector in trouble due to his twitter account hack

సాధారణ వ్యక్తుల కామెంట్లకు పెద్దగా విలువ ఉండక పోవచ్చు. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఏం చేసినా సంచలనమే. ఒక్కోసారి కొన్ని కామెంట్లు వివాదం కూడా అవుతుంటాయి. జగిత్యాల కలెక్టర్ గుగులోతు రవి ఇప్పుడు అటువంటి వివాదంలోనే చిక్కుకున్నారు. సినీ నటి రష్మిక మందన్న ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోలకు 'చించావ్లే పో' అంటూ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన కామెంట్ పెద్ద దుమారమే రేపుతోంది. విషయం తెలిసిన ఆయన 'అయ్యో....తనకా విషయమే తెలియదు' అంటూ లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే...భీష్మ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముందు రష్మిక ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. వేలాది మంది నచ్చాయంటూ కామెంట్లు పెట్టారు. అనూహ్యంగా జగిత్యాల కలెక్టర్ నుంచి కామెంట్ షేర్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బాధ్యతాయుతమైన కలెక్టర్ ఇలా వ్యాఖ్యానించడం ఏంటంటూ మండిపడ్డాడు.

విషయం తెలిసిన కలెక్టర్ రవి కూడా ఆశ్చర్యపోయారు. 'తానా కామెంట్ పెట్టలేదని, ఎవరో తన ఖాతా హ్యాక్ చేసినట్టు ఉన్నారు' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు నెటిజన్లు కూడా ఆలోచనలో పడ్డారు. కామెంట్ లో రష్మిక బదులు రద్మిక అని స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది.

కలెక్టర్ కామెంట్ అయితే అలా మిస్టేక్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు ఈడీఎం మమత, హ్యాండ్ హెల్డింగ్ పర్సన్ ప్రసాద్ లను విధుల నుంచి తప్పించారు.

More Telugu News