indian Army: కొత్త ప్రదేశానికి ఆర్మీ ప్రధాన కార్యాలయం మార్పు

  • ఢిల్లీ కంటోన్మెంట్ లోని కొత్త భవనానికి మార్చాలని నిర్ణయం
  • 39 ఎకరాల్లో భారీగా నిర్మాణానికి ఏర్పాట్లు
  • శుక్రవారం భూమి పూజ చేయనున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
  • నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలు కూడా త్వరలో తరలింపు
Indian Army to have new headquarters

భారత సైన్యానికి చెందిన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుతున్నారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో భారీ స్థాయిలో కొత్త భవనం నిర్మించి, అందులోకి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిలటరీ అంశాలను ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఆర్మీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ తాజాగా ప్రకటించింది.

శుక్రవారం భూమి పూజ

ప్రస్తుతం ఆర్మీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని రైజినా హిల్స్ ప్రాంతంలోని సౌత్ బ్లాక్ లో ఉంది. అక్కడి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని మానెక్ షా సెంటర్ సమీపంలో ఉన్న 39 ఎకరాల్లో నిర్మించే భారీ భవన సముదాయానికి తరలించనున్నారు. ఈ కొత్త భవన సముదాయానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ఐదేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మిగతా రెండు డిఫెన్స్ కార్యాలయాలు కూడా..

ఆర్మీతోపాటు నావికా దళం, వైమానిక దళం ప్రధాన కార్యాలయాలను కూడా తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి కూడా ప్రత్యేకంగా కొత్త భవనాలను నిర్మించనున్నారు. ఐదేళ్లలోగా వాటి తరలింపు కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

More Telugu News