BJP: త్వరలోనే ఏపీ, తెలంగాణలకు కొత్త బీజేపీ అధ్యక్షులు: మాజీ గవర్నర్ విద్యాసాగర్​ రావు

  • తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహంతో ఉంది
  • తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం.. ఏపీలో త్వరలోనే మార్పులు
  • సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని విమర్శ
new presidents for Telangana Ap state units said CH Vidyasagar rao

రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలకు త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోందని చెప్పారు.

అందరినీ కలుపుకొని వెళతాం

ఏపీ, తెలంగాణల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారని, ఎవరు అధ్యక్షుడు అయినా అందరినీ కలుపుకొని ముందుకు వెళతామని విద్యాసాగర్ రావు చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తమ పార్టీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయని తెలిపారు.

సీఏఏపై రాజకీయం చేస్తున్నారు

సీఏఏతో ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు దానిని వ్యతిరేకిస్తున్నాయని విద్యాసాగర్ రావు ఆరోపించారు. ప్రతిపక్షాల తీరు దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. జాతి సమైక్యతకు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీఆర్ లు ఎంతో అవసరమన్నారు. ముస్లిం యువత జాతీయ జెండాతో బయటికి వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు.

More Telugu News