Rohingyas: భారత్ నుంచి నేపాల్ వలస వెళ్లేందుకు రోహింగ్యాలకు ఇస్లామిక్ గ్రూపుల సాయం!

  • భారత్ నుంచి నేపాల్ తరలివెళ్లిన 378 మంది రోహింగ్యాలు
  • నేపాల్ లో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు రోహింగ్యాల ప్రయత్నాలు
  • ఆర్థికసాయం అందిస్తున్న ఇస్లామి సంఘ్ నేపాల్
  • కుట్రకోణం ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్న నిఘా వర్గాలు 
Rohingyas migrates Nepal with the help of Islamic Groups funding

మయన్మార్ లో వేధింపులు భరించలేక భారత్ తదితర దేశాలకు రోహింగ్యాలు తరలివెళ్లడం తెలిసిందే. చాలాఏళ్లుగా రోహింగ్యాలు భారత్ లో తలదాచుకుంటున్నారు. అయితే కొంతకాలంగా రోహింగ్యాలు భారత్ నుంచి నేపాల్ వలస వెళుతుండడం పట్ల పలు సందేహాలు తలెత్తుతున్నాయి. నేపాల్ వెళ్లే రోహింగ్యాలకు ఇస్లామిక్ గ్రూపులు ఆర్థికసాయం చేస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే భారత్ నుంచి 378 మంది రోహింగ్యాలు నేపాల్ కు వలస వెళ్లారు. వారు నేపాల్ లోనే స్థలాలు కొనుక్కుని స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారని, అక్కడి స్థానికులమని నిరూపించుకునేలా తగిన పత్రాలు పొందేందుకు రూ.4 వేల నుంచి రూ.50 వేల వరకు లంచాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారికి స్థలాలు కొనుక్కునేందుకు అవసరమైన నగదును నేపాల్ లోని కొన్ని ఇస్లామిక్ సంఘాలు అందజేస్తున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇస్లామి సంఘ్ నేపాల్ అనే సంస్థ కార్యకలాపాలు మరింత అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు.

ఓవైపు, భారత్-నేపాల్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ జిహాదీ క్యాంపులను ఏర్పాటు చేస్తుండడం, మరోవైపు రోహింగ్యాలు నేపాల్ లో నివాసం ఏర్పరచుకునేందుకు భారీగా ఆర్థికసాయం అందజేస్తుండడం వంటి చర్యల వెనుక భారత వ్యతిరేక కుట్ర ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని నిఘా వర్గాలంటున్నాయి.

More Telugu News