Srisailam: మంత్రిగారి రాక కోసం ఎదురుచూపులు.. మల్లన్న ఉత్సవానికి అంతరాయం!

  • అధికారిక వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన బుగ్గన
  • 6 గంటలకు రావాల్సిన మంత్రి 8 గంటలకు
  • రెండు గంటలు ఆలస్యమైన గ్రామోత్సవం
Srisailam Gramotsavam Late Because Minister Buggana Late

శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ, శ్రీశైలంలో భక్తకోటి తమ ఇలవేల్పు కళ్ల ముందుకు రానున్నాడని ఆనందంతో ఉండగా, సమయానికి స్వామి భక్తులను కరుణించేందుకు కదల్లేదు. దీంతో భక్తులు అసంతృప్తితో పెదవి విరిచారు. ఇంతకీ ఏం జరిగిందంటే, శ్రీశైలంలో నిన్న సాయంత్రం స్వామివారు, తనకెంతో ఇష్టమైన రావణ వాహనంపై పుర వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వాలి.

ఈ కార్యక్రమం కన్నా ముందు స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులకు సమాచారం అందింది. సాయంత్రం 6.30 గంటలకల్లా బుగ్గన వస్తారని సమాచారం అందగా, అధికారులు వేచి చూస్తున్నారు. 7 గంటల కెల్లా రావణ సేవను ప్రారంభించ వచ్చని భావించారు.

కానీ, సీఎం జగన్, కర్నూలు పర్యటనలో ఉండటం, ఆయనతో పాటే బుగ్గన కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో, వారి రాక ఆలస్యమైంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి రాత్రి 8 గంటల సమయంలో బుగ్గన శ్రీశైలం చేరుకున్నారు. అప్పటివరకూ రావణ సేవ ప్రారంభం కాలేదు. వారు వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించిన తరువాత రాత్రి 9 గంటలకు గ్రామోత్సవం ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు ఉత్సవం ఆలస్యం కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News