Gajwel: వారంలో పెళ్లి.. శుభలేఖలు పంచి ఇంటికొచ్చి దారుణ హత్యకు గురైన బ్యాంకు ఉద్యోగిని!

  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఘటన
  • బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి
  • ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానం
Bank woman employee murdered in Gajwel

శుభలేఖలు పంచి  ఇంటికొచ్చిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో గతరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య (23) గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇంటి పై అంతస్తులో తల్లిదండ్రులు న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మణెమ్మతో కలిసి నివసిస్తోంది.

దివ్యకు ఇటీవల వరంగల్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో దివ్య కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. దివ్య నిన్న బ్యాంకులోని తన సహోద్యోగులకు శుభలేఖలు పంచిపెట్టి ఇంటికి చేరుకుంది.

సాయంత్రం కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆమె పెద్దగా అరిచి కుప్పకూలిపోయింది. అటు నుంచి ఏమైందని అడుగుతున్నా సమాధానం లేకపోవడంతో ఆయన బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెంటనే ఆమె ఇంటికి వచ్చి చూసి హతాశులయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దివ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

దివ్యను పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని విషయం తెలుసుకున్న నిందితుడు నేరుగా ఇంటికి వెళ్లి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని దివ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. 8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వెంకటేశం.. ఆ తర్వాత ప్రేమ పేరుతో వేధించాడని పోలీసులకు తెలిపారు.

కేసు పెట్టడంతో అప్పట్లో ఆ గొడవ సద్దుమణిగిందని, మళ్లీ రెండు నెలల నుంచి ప్రేమ పేరుతో వేధింపులు మొదలుపెట్టాడని తెలిపారు. దీంతో మరోమారు అతడిపై కేసు పెట్టగా, అతడి తల్లిదండ్రులు వచ్చి తమ కుమారుడు దివ్య జోలికి రాడంటూ రాసి ఇచ్చినట్టు చెప్పారు. కుమార్తెకు పెళ్లి చేస్తే వేధింపులు తగ్గుతాయని భావించామని, కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీరుపెట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News