Kesineni Nani: నేనో ఎంపీని... మా అమ్మ బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ్నించి తేవాలో నాకు అర్థం కావడం లేదు: కేశినేని నాని

  • విజయవాడలో ఎంఐఎం బహిరంగ సభ
  • సీఏఏ, ఎన్సార్సీని వ్యతిరేకిస్తూ సభ ఏర్పాటు
  • సభకు హాజరైన టీడీపీ ఎంపీ కేశినేని నాని
TDP MP Kesineni Nani attends MIM rally in Vijayawada

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఏఏ, ఎన్నార్సీ నిర్ణయాలు సరికాదని అన్నారు. ఇటీవల తన తల్లి బర్త్ సర్టిఫికెట్ లేదని చెబితే, ఆమెకు ఇప్పటికిప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఎలా తేవాలో అర్థం కాలేదని, ఓ ఎంపీనైన తన పరిస్థితే అలావుంటే, సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఆవిడ పౌరసత్వాన్ని ఎలా నిరూపించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కేరళ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో సీఏఏ, ఎన్నార్సీలపై తీర్మానం చేసిందని, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా అసెంబ్లీలో సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. మీకు మండలి రద్దు బిల్లు ఎంత ముఖ్యమో, మీకు మూడు రాజధానుల బిల్లు ఎంత ముఖ్యమో, దేశంలో నివసించే ప్రతి పేదవాడికి ఈ సీఏఏ వ్యతిరేక తీర్మానం అంత ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు అందరూ మద్దతు పలుకుతారని అన్నారు. ఆద్యంతం ఆవేశపూరితంగా ప్రసంగించిన కేశినేని నానీని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు.

More Telugu News