partha sarathi: చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి విమర్శలు

  • అమరావతిని ఒక బంగారు గుడ్డుగా బాబు భావించారు
  • అంతేతప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోలేదు
  • ఏపీలో ఏదో జరిగి పోయిందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం తగదు
Ysrcp leader Partha sarathi comments on chandrababu

టీడీపీ నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి అభివృద్ధి గురించి చంద్రబాబు తన హయాంలో ఎన్నడూ ఆలోచించలేదని, సబ్ కాంట్రాక్టర్లకు పేమెంట్ కోసమే ‘ప్రతి సోమవారం.. పోలవరం’ కార్యక్రమాన్ని నాడు చంద్రబాబు నిర్వహించారని ఆరోపించారు. ప్రతి శనివారం మేస్త్రీలకు, లేబర్ కు పేమెంట్ సెటిల్ చేస్తుంటారని, అలాగే, ప్రతి సోమవారం ఈ సబ్ కాంట్రాక్టర్లకు ‘పేమెంట్ సెటిల్ మెంట్ డే’ గా పెట్టుకుని ఉంటారంటూ బాబుపై ధ్వజమెత్తారు.

అంతగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతోందో ప్రజలు గమనించాలని సూచించారు. అమరావతిని ఒక బంగారు గుడ్డుగా, అన్యాయంగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ ను ఒక కల్పతరువులా చంద్రబాబు భావించారు తప్పితే బాధ్యతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నాడు ఆయన అనుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియాపైనా ఆయన మండిపడ్డారు. ఏపీలో ఏదో జరిగి పోయిందంటూ సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చడానికి యత్నిస్తోందని అన్నారు.

More Telugu News