Jagan: తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు.. హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ

  • ఆంధ్రాను కాపాడమని విజయ్‌కు జగన్‌, పీకే చెబుతున్నట్లు పోస్టర్లు
  • విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నట్లు వ్యాఖ్యలు
  • తమిళనాడుని విజయ్‌ కాపాడాలంటోన్న అభిమానులు
Jagan Prashant Kishor telling Vijay to We have saved Andhra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. 'రావాలి విజయ్.. కావాలి విజయ్' అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి.  

 ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము ఏపీని కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో  వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు.  

More Telugu News