Amarnath Reddy: ఏపీ ప్రజలు ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు: మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి

  • బీజేపీ ఓటమితో ప్రజల మనోభావాలు అర్థమవుతున్నాయి
  • కేజ్రీవాల్ మాదిరి బాబు కూడా పథకాలు అమలు చేశారు
  • అయినప్పటికీ, ప్రజలు ‘ఒక్కఛాన్స్’కే పట్టం కట్టారు

ప్రధాని మోదీ, బీజేపీ, వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి విమర్శలు చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని మోదీ ఎదగనివ్వడం లేదని, ప్రత్యర్థులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను ప్రజలు గ్రహించారని అన్నారు. ఢిల్లీలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైందంటే ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని అన్నారు.

ఢిల్లీలో కేజ్రీవాల్ మాదిరి ఏపీలో చంద్రబాబు కూడా అన్ని పథకాలు అమలు చేశారు కానీ, ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ వైపు మొగ్గుచూపారని, ఇప్పుడు తలలు బాదుకుంటున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం తీరు చూసి చివరకు, వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమాన్ని మర్చిపోయి కక్షసాధింపు చర్యలపై సీఎం జగన్ దృష్టిపెట్టారని విమర్శించారు.

More Telugu News