raja singh: ఇదంతా ఓ ప్లాన్‌.. ఆ కుట్రలో భాగంగానే కేసీఆర్‌ను అక్బరుద్దీన్‌ నిన్న కలిశారు: రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

  • అడిగిన వెంటనే సీఎం నిధులు విడుదల చేశారు
  • దీని వెనుక కుట్ర ఏంటో తెలుసా?
  • హిందువులకి వ్యతిరేకంగా అక్బరుద్దీన్ మాట్లాడాడు
  • వ్యతిరేకత పోవడానికే అక్బరుద్దీన్‌తో ఆలయం గురించి వినతి చేసేలా  కేసీఆర్‌ చేశారు

హైదరాబాద్‌లోని పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళీ సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కలిసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'నిన్న అక్బరుద్దీన్ ఒవైసీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిసి, మన లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారి ఆలయం గురించి మాట్లాడాడు. అదే విధంగా కొన్ని మసీదుల గురించి మాట్లాడాడు. వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు కూడా విడుదల చేశారు. దీని వెనుక కుట్ర ఏంటో తెలుసా?' అని వ్యాఖ్యానించారు.

'అక్బరుద్దీన్‌ పై ఒక మచ్చ ఉంది.. హిందువులకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. గోమాంసం గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. హిందూ ధర్మంపైన మాట్లాడాడు. టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిశాయి.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లాన్.. అక్బరుద్దీన్‌ను లెటర్ ఇవ్వమని చెప్పారు' అని రాజా సింగ్ అన్నారు.

'ఆ తర్వాత వెంటనే ఫండ్ విడుదల చేస్తానని చెప్పారు. దీంతో హిందువులు ఒవైసీకి సానుకూలంగా మారతారని కేసీఆర్ ప్లాన్ వేశారు. నేను ముఖ్యమంత్రిని ఓ రిక్వెస్టు చేస్తున్నా.. మీరు మరోసారి అక్బరుద్దీన్‌ను పిలవండి. హిందువుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరమని చెప్పండి' అని అన్నారు.

'ఇలా చెబితే అక్బరుద్దీన్‌ ఒవైసీ మారిపోయిండని ప్రజలు అప్పుడు నమ్ముతారు. ప్రజలకు అన్నీ తెలుసు.. మీరేం పనులు చేస్తున్నారో. అక్బరుద్దీన్‌పై దేశ ద్రోహం కేసులు ఉన్నాయి' అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

పాతబస్తీలోని కాళిమాయ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో అందరికీ కేసీఆర్ సీఎం అని, అయితే నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవటానికి సీఎం సమయం ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు.

More Telugu News