Corona Virus: 9 అనుమానిత కేసులు... హైదరాబాద్ లో కరోనా కలకలం!

  • రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపిన వైద్యులు
  • ఇప్పటివరకూ కరోనా ఎవరికీ సోకలేదు
  • స్పష్టం చేసిన వైద్యులు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా, హైదరాబాద్ లోనూ కలకలం రేపుతోంది. తాజాగా 9 మంది కరోనా వ్యాధి అనుమానిత బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో, వైద్యులు వారి రక్త నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం పంపారు.

ఇప్పటివరకూ 70 మందికి హైదరాబాద్ లో పరీక్షలు నిర్వహించగా, 62 మందికి కరోనా నెగటివ్ వచ్చింది. మిగతావారి రిపోర్టులు రావాల్సి వుందని గాంధీ హాస్పిటల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. తాజాగా 9 మంది రక్తాన్ని పరీక్షలకు పంపామని అన్నారు. రోజురోజుకూ అనుమానిత రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, మరో 10 పడకల ఐసొలేషన్ వార్డును నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఇంతవరకూ కరోనా వ్యాధి ఎవరికీ సోకలేదని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో శీతాకాలం కావడంతో స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. గాంధీ ఆసుపత్రిలో 5 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరికి చికిత్సను అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కరోనా సోకిందన్న అనుమానంతో వచ్చిన బాధితుల్లోనే స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు ఉండటం గమనార్హం.
Corona Virus
Telangana
Hyderabad
Gandhi Hospital

More Telugu News