Amaravati: ఈ నెల 15న అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటన

  • 12,13వ తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటన
  • 14న విశ్రాంతి.. మర్నాడు అమరావతి గ్రామాల సందర్శన
  • షెడ్యూల్ ను ప్రకటించిన పార్టీ నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 15న ఆ గ్రామాల్లో పర్యటించడానికి పార్టీ నేతలు షెడ్యూల్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్ ను కలిసి మరోసారి తమ గ్రామాల్లో పర్యటించవలసిందిగా కోరడంతో ఈ పర్యటనకు ఒప్పుకుని షెడ్యూల్ సిద్ధం చేయమని పార్టీ నేతలను పవన్ కోరారు.

నిజానికి పవన్ ఈ నెల 10వ తేదీనే అమరావతి గ్రామాల్లో పర్యటించాల్సి ఉండగా, సినిమా షూటింగ్ లు, కర్నూలు జిల్లాలో పర్యటన కారణంగా అది వాయిదా పడింది. పవన్ కర్నూలు జిల్లాలో ఈ నెల 12, 13 తేదీల్లో పర్యటించనున్నారు. అనంతరం ఒకరోజు విశ్రాంతి తీసుకుని 15న అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారని సమాచారం.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన రైతులను పోలీసులు అడ్డుకోవడం, లాఠీ చార్జీ చేయడంతో చాలామంది గాయపడ్డారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన పవన్ ను, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా పవన్ అమరావతి పర్యటనకు సిద్ధం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

More Telugu News