Priyanka Gandhi: తొలిసారి ఓటు వేసిన ప్రియాంకాగాంధీ కుమారుడు.. చుట్టుముట్టిన మీడియా!

  • గత ఏడాదే 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రైహాన్ వాద్రా
  • తల్లిదండ్రులతో కలసి ఓటు వేసేందుకు వచ్చిన రైహాన్
  • ప్రజల కోసమే ఓటు వేశానన్న ప్రియాంక తనయుడు

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తల్లి ప్రియాంక, తండ్రి రాబర్ట్ వాద్రాలతో కలసి ఆయన పోలింగ్ బూత్ కు వచ్చారు. గత ఏడాదే రైహాన్ 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే పరీక్షలు ఉండటంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.

మరోవైపు ఓటు వేసేందుకు వచ్చిన రైహాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మీడియా ఆయనను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా రైహాన్ మాట్లాడుతూ, తన జీవితమంతా ఢిల్లీలోనే గడిచిందని... ఈ నగరం మరింత అభివృద్ధి చెందాలని, ప్రపంచ అగ్రస్థాయి నగరాల సరసన ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం తాను ఓటు వేశానని చెప్పారు.

ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం ప్రధానంగా ఏ సమస్యపై దృష్టి సారించాలని రైహాన్ ను మీడియా ప్రశ్నించింది. తన కుమారుడు ఏం చెబుతాడోనని ప్రియాంక కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ప్రశ్నపై రైహాన్ స్పందిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రావాలని, విద్యార్థులకు రాయితీలు కల్పించాలని చెప్పారు.

More Telugu News