KIA Motors: కియా తరలింపుపై వస్తున్నవన్నీ గాలి వార్తలే: గోరంట్ల మాధవ్

  • కియో ఏపీ నుంచి వెళ్లిపోతోందంటూ మీడియా కథనాలు
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య రగిలిన చిచ్చు
  • ప్రభుత్వంపై మండిపడుతున్న టీడీపీ నేతలు

ఏపీలో ఇప్పుడు కియా మోటార్స్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన కియా మోటార్స్ యూనిట్ ను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రాయిటర్స్ మీడియా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా, కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లడం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

దీనిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లడంలేదని స్పష్టం చేశారు. కియా మోటార్స్ గురించి వస్తున్న వార్తలన్నీ గాలివార్తలేనని పేర్కొన్నారు. కియా అభివృద్ధికి తగిన చేయూతనిచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కియా మోటార్స్ అంశంపై సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కియాకు ఎంతో విలువైన భూములు ఇచ్చామని, ఒక్క టీఎంసీ నీటితో 15 వేల ఎకరాలకు తడి అందించవచ్చని,అలాంటి విలువైన నీటిని అందించామని తెలిపారు. పరిశ్రమ వస్తే సీమ కరవు పోతుందని, నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించామని గోరంట్ల వివరించారు.

More Telugu News