Kurnool District: చిన్నారిని చిదిమేయాలనుకున్నాడు...ఆటో డ్రైవర్ ను చితకబాదిన యువకులు

  • ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నం
  • బాలిక కేకలతో గుర్తించిన ఇద్దరు యువకులు
  • నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత 

అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్‌ ఆశచూపి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌ను ఇద్దరు యువకులు చితకబాది పోలీసులకు అప్పగించారు.  నిందితుడి క్రూరచేష్టలకు భయపడిన చిన్నారి కేకలు వేయడంతో ఈ మానవ మృగం దారుణం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నిన్నరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.

ఆదోని పట్టణం అమరావతినగర్‌కు చెందిన సికిందర్‌ పట్టణ శివారులో నాటుసారా తాగేందుకు వచ్చాడు. అక్కడికి సమీపంలో ఓ ఇంటి ముందు ఐదేళ్ల బాలిక ఆడుకుంటోంది. ఆమెకు చాక్లెట్‌ ఇస్తానంటూ ఆశచూపి తన ఆటో ఎక్కించుకున్నాడు. అనంతరం ఊరికి దూరంగా తీసుకువెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు.

ఏం చేస్తున్నాడో అర్థంకాని ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు శివస్వాముల మల్లికార్జున, విజయ్‌కుమార్‌లు దారుణాన్ని గుర్తించి ఆటో డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టారు. చిన్నారిని  రక్షించి నిందితుడిని ఒన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

విషయం తెలిసిన చిన్నారి ప్రాంత వాసులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రి 11 గంటల వరకు ఆందోళన చేశారు. నిందితుడిపై ఫోక్సో, కిడ్నాప్‌, అత్యాచార సెక్షన్‌ కింద కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.

More Telugu News