Pawan Kalyan: ఉగాది సందర్భంగా పవన్ సినిమా టైటిల్ విడుదల చేస్తాం: దిల్ రాజు

  • పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కల్యాణ్
  • మరో రెండు చిత్రాలకు సైన్
  • మే 15న పింక్ రీమేక్ విడుదలవుతుందన్న దిల్ రాజు

జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో నటిస్తారని కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్నా, ఆ తర్వాత క్రిష్, హరీశ్ శంకర్ ల దర్శకత్వంలోనూ నటిస్తున్నట్టు వార్తలు రావడం విస్మయానికి గురిచేసింది.

'పింక్' రీమేక్ విషయానికొస్తే తామింకా టైటిల్ గురించి ఏమీ అనుకోలేదని, ఉగాదికి టైటిల్ అనౌన్స్ చేస్తామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ సినిమాను వేసవి కానుకగా తీసుకువస్తున్నామని, బహుశా మే 15న రిలీజ్ కావొచ్చని వివరించారు. పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రం కూడా మే నెలలోనే 11వ తేదీ రిలీజై భారీ హిట్టయిందని తెలిపారు.

ప్రస్తుతం తాము 'జాను' చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నామని, ఆ తర్వాత 'వి' చిత్ర ప్రచార కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం పూర్తిగా 'పింక్' రీమేక్ పై దృష్టిపెడతామని దిల్ రాజు చెప్పారు. 'పింక్' ఒరిజనల్ వెర్షన్ కు చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఓ కొత్త చిత్రం చూస్తారని తెలిపారు. పవన్ తో తనకు 'తొలిప్రేమ' నుంచి పరిచయం ఉందని, అప్పుడు తాను డిస్ట్రిబ్యూటర్ నని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు. ఆయనతో ఎప్పటికైనా సినిమా తీయాలనుకుంటే ఇన్నాళ్లకు కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News