Vijayawada: విజయవాడ పద్మావతి హత్యకేసులో వీడని మిస్టరీ.. పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలు!

  • మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన పద్మావతి
  • బీరువాలోని సొత్తును ముట్టుకోని దుండగులు
  • హత్యకు మరేదో కారణం ఉండి ఉంటుందని అనుమానం

విజయవాడలోని భవానీపురంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన యేదుపాటి పద్మావతి హత్య కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. తొలుత ఈ హత్యను దోపిడీ దొంగల పనిగా పోలీసులు అనుమానించారు. అదే నిజమైతే ఇంట్లోని సొత్తును కూడా దొంగలు దోచుకెళ్లి ఉండేవారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఆమె చెవికి ఉన్న బంగారు దుద్దులు, ఉంగరం అలానే ఉన్నాయి. మెడలోని గొలుసు, చేతికి ఉన్న గాజులు మాత్రమే తీసుకెళ్లారు. దీనిని బట్టి చూస్తే హత్యకు వేరే కారణం ఏదో ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, ఏ కోణంలో దర్యాప్తు చేసినా పోలీసులను అంతుచిక్కని ప్రశ్నలు వేధిస్తున్నాయి. దుండగులు నిజంగా దోపిడీ కోసమే వచ్చి ఉంటే ఇంటిని మొత్తం ఊడ్చిపడేసి ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. అంటే, హత్య వెనక ఇంకేదో కారణం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.

బీరువాలోని సొత్తు మాయం కాలేదని, తాళం బీరువాకే ఉన్నా దానిని ముట్టుకోలేదని స్వయంగా కుటుంబ సభ్యులే చెబుతున్నారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కుటుంబంలో మనస్పర్థలు కూడా లేవని, ఎవరి మీదా తమకు అనుమానం లేదని చెబుతున్నారు. దీంతో అంత ధైర్యంగా ఇంట్లోకి చొరబడి, అంత క్రూరంగా పద్మావతిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కదలికలపై కొన్ని రోజులుగా నిఘాపెట్టి మరీ పద్మావతిని అంతమొందించి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆమె కాల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News