Vijayawada: విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన రెడీ...రేపటి నుంచి వాహనాలకు అనుమతి

  • ప్రారంభోత్సవం లేకుండా ట్రయిల్ రన్ 
  • నితిన్ గడ్కరీ చేతులు మీదుగా ప్రారంభించే యోచన 
  • బెంజి కూడలి పై తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ భారం

విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన పై రేపటి నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెన పై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న జాతీయ రహదారుల విభాగం సంచాలకుడు విద్యాసాగర్, ట్రాఫిక్ డీసీపీ నాగరాజులు వంతెనను తనిఖీ చేశారు.

అలాగే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు రేపు మరోసారి వంతెనను పరిశీలించి వాహనాలకు పచ్చజెండా ఊపుతారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేతులు మీదుగా వంతెనను ప్రారంభిస్తారని భావిస్తున్నారు.

తొలుత ఈ వంతెనను కేవలం నిర్మల కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. భవిష్యత్తు అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి కూడలి వరకు పొడిగించాలన్న అప్పటి సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేనిల విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించి అనుమతించింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అలాగే రూ.2వేల కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించినందున నగరంలో ట్రాఫిక్ రద్దీ తీరేందుకు ఇది మరింత ఉపయుక్తమవుతుంది.

More Telugu News