Vijayawada: ఉలిక్కిపడిన విజయవాడ.. ఇంట్లోకి చొరబడి, మహిళ గొంతుకోసి హత్య చేసి నగల అపహరణ!

  • నిన్న సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఘటన
  • గొంతు కోసి, కత్తితో పొడిచి దారుణం
  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్థుల పనేనని అనుమానం

విజయవాడలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఓ మహిళ గొంతు కోసి నగలతో ఉడాయించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం కెనరా బ్యాంకు రోడ్డులో నివసించే దంపతులు యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి నిన్న ఉదయం బంధువుల ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతానికి వెళ్లారు.

 అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భార్యను ఇంటి వద్ద దింపిన వెంకటేశ్వర్లు పని నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా, లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. రక్తపు మడుగులో పడివున్న పద్మావతిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్కడి పరిస్థితిని బట్టి అది దోపిడీ దొంగల పనేనని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనా కొచ్చారు. పద్మావతి మెడను కోసిన దుండగులు.. మణికట్టు, పొట్టపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. తమను గుర్తుపట్టకుండా మృతదేహం చుట్టూ కారంపొడి చల్లారు. అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి చూసినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్న దుస్తులను బట్టి తెలుస్తోంది. బంగారం, నగలు కోసమే వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు నిర్ధారించారు. శుభకార్యానికి వెళ్తూ ఆమె ధరించిన నగలు మాయమయ్యాయి. హత్యకు ముందు హంతకులు రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు.
 
ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలు, ఆధారాలను బట్టి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్థులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ వీధిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని గుర్తించినట్టు పేర్కొన్న పోలీసులు బీరువాలోని నగలు, నగదు ఏమీ పోలేదని తెలిపారు. ఒంటిపై ఉన్న గాజులు, బంగారు గొలుసు మాత్రమే తీసుకెళ్లారని తెలిపారు. హత్యపై లోతైన విచారణ జరుపుతున్నట్టు విజయవాడ డీసీపీ-2 విక్రాంత్ పాటిల్ తెలిపారు.

More Telugu News