District Collector: కలెక్టర్లకు జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు

  • మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితుల పిటిషన్ పై విచారణ
  • కలెక్టర్, అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించారు
  • కలెక్టర్లకు రూ.2 వేలు చొప్పున జరిమానా 
  • ఆర్డీఓ జయచందర్ రెడ్డికి 2నెలల జైలు శిక్ష

మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణలో కోర్టు ధిక్కరణ జరిగిందన్న తెలంగాణ హైకోర్టు కలెక్టర్, అధికారులకు శిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించకుడా నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు కోర్టు ధిక్కరణ కింద సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు రూ.2 వేలు చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాలల్లో జరిమానా చెల్లించకపోతే నెల రోజుల జైలు శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది. మరోవైపు సిద్దిపేట ఆర్డీఓ జయచందర్‌రెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానాను విధించింది. అంతేకాక,12 మంది పిటిషనర్లకు రూ.2 వేల చొప్పున చెల్లించాలని అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డును ఇచ్చారని 2018లో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను రైతులకు వివరించాలని, వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని.. విచారణ జరిపి ఆర్డర్‌ను ఇవ్వాలని గతంలో కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ, రైతుల అభ్యంతరాలు వినకుండానే డిక్లరేషన్, అవార్డును అధికారులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ.. బాధిత రైతులు గత ఏడాది మేలో మరోసారి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాజాగా విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

More Telugu News