Crime News: లంచం అడిగిందని ఆరోపణ చేయడంతో.. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణి!

  • ఇంటి నిర్మాణ అనుమతి కోసం మూడేళ్లుగా తిరుగుతున్న దశరథరామిరెడ్డి
  • లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బాధితుడి ఆరోపణ
  • న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకున్న బాధితుడు
  • నిన్న మరోసారి అనుమతి అడగ్గా దాడికి పాల్పడ్డ అధికారిణి

ఓ వ్యక్తిపై ప్రభుత్వాధికారిణి తన కాలికున్న చెప్పు తీసి విసిరింది. మరో చెప్పుతో ఆ వ్యక్తిని అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు కొట్టింది. లంచం ఇవ్వనందుకు తనపై ఆ అధికారిణి చెప్పులతో దాడి చేసిందని బాధిత వ్యక్తి తెలిపాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఇంటి నిర్మాణం కోసం అనుమతి కావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన ఓ అధికారిణికి దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు ఇవ్వకుండా లంచం ఇవ్వాలని ఆమె వేధించింది. దీంతో న్యాయస్థానానికి వెళ్లి, అనుమతి కోసం ఆర్డర్లు తెచ్చుకున్నాడు.  

అయినప్పటికీ అధికారిణి నుంచి స్పందన లేకపోవడంతో అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అది తెలిసి ఇంటి నిర్మాణం పరిశీలించేందుకు అధికారులు వచ్చారు. అనుమతులు లేకుండా ఎందుకు నిర్మిస్తున్నావని ప్రశ్నించారు. అనుమతులు మంజూరు చేయాలని వారిని మరోసారి కోరాడు.

అధికారిణి లంచం అడిగిందని అతడు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. నన్నే లంచం అడిగానని అంటావా? అంటూ చెప్పులతో బాధితుడిపై దాడి చేసింది. ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ అధికారుల చుట్టూ మూడేళ్లుగా తిరిగానని బాధితుడు చెప్పాడు.

More Telugu News