Suman: 'శివాజీ'లో విలన్ గా చేస్తున్నందుకు ఫీలవుతున్నారా?' అని రజనీ అడిగారు: హీరో సుమన్

  • శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది 
  • 'శివాజీ' చేయడానికి ఓకే అన్నాను
  • గొప్ప టీమ్ తో కలిసి పనిచేశానన్న సుమన్

సుమన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'శివాజీ' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన రజనీని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ఆ సినిమా విశేషాలను ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు. "తమిళ చిత్ర పరిశ్రమకి దూరమై చాలాకాలం అయింది .. అక్కడ ఒక సినిమా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్న సమయంలోనే, దర్శకుడు శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.

నేను వెళ్లి ఆయనని కలిస్తే కథ వినిపించారు. పెద్ద బ్యానర్ .. రజనీ హీరో .. శంకర్ దర్శకుడు .. ఏఆర్ రెహ్మాన్ సంగీతం.. ఇక 'నో' అని ఎలా చెబుతాం .. 'ఎస్' అని చెప్పేశాను. ఆ తరువాత రజనీకి కాల్ చేశాను. 'ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నందుకు మీరేం ఫీల్ కావడం లేదు గదా?' అని రజనీ అడిగారు. 'అలాంటిదేమీ లేదు సార్ .. మీ ఆశీస్సులు కావాలని చేశాను' అన్నాను. 'ఈ సినిమాలో విలన్ రోల్ మీకు మంచి పేరు తెస్తుంది' అన్నారు. ఆయన అన్నట్టుగానే జరిగింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News