కాకతీయ ప్యాసింజర్ రైలు చక్రాల్లో ఇరుక్కున్న ప్రయాణికుడు.. గంటపాటు నరకయాతన!
- రైలు వేగం తగ్గడంతో దిగేందుకు యత్నం
- చక్రాల కిందపడి కాలు కోల్పోయిన వైనం
- పరిస్థితి విషమం
స్టేషన్లో రైలు వేగం తగ్గడంతో రైలు దిగేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి చక్రాల కిందపడ్డాడు. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేకులు వేయడంతో మరో కాలు తెగిపోయే ప్రమాదం తప్పింది. అయితే గంటపాటు చక్రాల కిందే ఉండిపోయిన బాధితుడు నరక యాతన అనుభవించాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద అతడిని రక్షించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.