Telugudesam: త్యాగాలు చేసిన వాళ్లు ప్రజల గుండెల్లో ఉంటారు: చంద్రబాబు

  • పోరాడే వాళ్లకే పార్టీలో పెద్ద పీట
  • బెదిరింపులకు భయపడితే కనుమరుగవుతారు  
  • ప్రజల గుండెల్లోంచి టీడీపీని తుడిచేయడం అసాధ్యం

శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పార్టీకోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయి. పోరాడే వాళ్లకే పార్టీలో పెద్ద పీట.  త్యాగాలు చేసిన వాళ్లు ప్రజల గుండెల్లో ఉంటారు. విలువలు, మంచిపేరే కలకాలం ఉంటాయి. మండలిలో యనమల ధ్వజస్తంభం మాదిరిగా నిలబడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీలంతా కోటగోడగా నిలబడ్డారు. ప్రజలు ఒక్కసారే జగన్ చేతిలో మోసపోయారు. మళ్లీ..మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల గుండెల్లోంచి టీడీపీని తుడిచేయడం అసాధ్యం’ అని అన్నారు.

1984లో టీడీపీ పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీలకు అలాంటి అవకాశం వచ్చిందన్నారు. వారు విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని చెప్పారు. 1984 పోరాటాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ‘బెదిరింపులకు భయపడితే కనుమరుగవుతారు. ప్రలోభాలకు లొంగితే తెరమరుగవుతారు’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News