Medaram: మేడారం జాతరకు నగరం నుంచి 500 ప్రత్యేక బస్సులు

  • ఒకేసారి 50మంది ప్రయాణిస్తే వారి వద్దకే బస్సు 
  • ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ఈ సౌకర్యం
  • ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు

త్వరలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగారెడ్డి రీజియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం జాతర సందర్భంగా 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2 నుంచి 8వరకు నడుస్తాయన్నారు.  నగరంలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, లింగంపల్లి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం పాయింట్లనుంచి ఇవి నడుస్తాయన్నారు. ఈ పాయింట్లలో డిపో మేనేజర్ స్థాయి అధికారులు ఉండి బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తారన్నారు.

ఈ బస్సుల్లో ప్రయాణించడానికి అన్ లైన్ లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోనే ఏ ప్రాంతంనుంచైనా సరే ఒకేసారి యాబైమంది ప్రయాణికులు మేడారంకు వెళుతుంటే వారి వద్దకు బస్సును పంపుతామని చెప్పారు. ఈ నెల 26న 40 ప్రత్యేక బస్సులు నగరంలోని అన్ని పాయింట్ల నుంచి నడుపుతామన్నారు. ఫిబ్రవరి 2న 30 బస్సులు, 3న 35బస్సులు, 4న 40బస్సులు, 5న 100బస్సులు, 6న 120 బస్సులు 7న 140 బస్సులు, 8న 35 బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులు ముందస్తుగా తమ టికెట్లను వెబ్ సైట్ www.tsrtconline.in నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు.

 ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి చార్జీలు
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో.. పెద్దలకు రూ.440, పిల్లలకు రూ.230; డీలక్స్ బస్సుల్లో.. పెద్దలకు రూ.480, పిల్లలకు రూ.250; సూపర్ లగ్జరీ.. పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.290; రాజధాని ఏసీ..  పెద్దలకు రూ.710, పిల్లలకు రూ.540; గరుడ ప్లస్ ఏసీ..  పెద్దలకు రూ.860, పిల్లలకు రూ.660

ప్రత్యేక పాయింట్ల నుంచి చార్జీలు..
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో.. పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.240; డీలక్స్ బస్సుల్లో.. పెద్దలకు రూ.510, పిల్లలకు రూ.260; సూపర్ లగ్జరీ.. పెద్దలకు రూ.580, పిల్లలకు రూ.300; రాజధాని ఏసీ..  పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.570; గరుడ ప్లస్ ఏసీ..  పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.690

More Telugu News