Chandrababu: అమరావతి కోసం ప్రజలు తమ సెల్‌ఫోన్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పిన చంద్రబాబు!

  • నేను ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉంటా
  • మరో 15 ఏళ్లు బతుకుతా
  • అందరి ఫోన్లలో ‘జై అమరావతి’ని రింగ్‌టోన్‌గా పెట్టుకోండి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, కాబట్టి మరో 10-15 ఏళ్లు బతుకుతానని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక నేరస్తుడు సీఎం అయ్యాడని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రానికి ఇంతగా చెడు చేసిన వ్యక్తులు మరెవరూ లేరన్నారు. ఒక్క రాజధానికే దిక్కులేదని, ఈ సీఎం మూడు రాజధానులు కడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందోని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కోడి పందాలు, టిక్‌టాక్‌లు, ఎడ్ల పందాల్లో బిజీగా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ వీడియో గేమ్స్‌లో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. మహిళలను హింసించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భోగి పండుగ రోజున జీఎన్ రావు, బోస్టన్ కమిటీలను భోగి మంటల్లో వేస్తే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందన్నారు. ఇకపై ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో ‘జై అమరావతి’ అనే రింగ్‌టోన్ పెట్టుకోవాలని, ఎవరైనా ఫోన్ చేసినా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా జై అమరావతి అని చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News