Amaravati: శ్రీనగర్ లోని పరిస్థితిని ఏపీకి తీసుకురావడం అన్యాయం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు

  • అమరావతిపై సంతకాల సేకరణలో పాల్గొన్న నేత
  • రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం  
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శ్రీనగర్ లోని పరిస్థితిని ఏపీలోకి తీసుకురావడం అన్యాయమన్నారు. గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా? అంటూ ప్రశ్నించారు.

ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతల అరెస్టు సంస్కృతి లేదని చెబుతూ.. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర లేపిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఆపి విశాఖకు నీరు తెస్తాననడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుని వెళ్లాలన్నారు. అందరినీ రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచిదికాదని సీఎం జగన్ కు సూచించారు.
Amaravati
Capital
Telugudesam
vijayanagaram
Signatures
Ashok Gajapathi Raju

More Telugu News