Prakasam District: కోడికూరతో పాటు నువ్వు కూడా కావాలి: ఉద్యోగినిపై కురిచేడు తహసీల్దార్ వేధింపులు

  • క్రిస్మస్ విందు ఇచ్చిన ఉద్యోగిని
  • వెళ్లకుండా ఒంటరి విందు కావాలన్న తహసీల్దార్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ డీవీబీ వరకుమార్, తనను లైంగికంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న దర్శి డీఎస్పీ, ప్రకాశరావు స్వయంగా దర్యాఫ్తును పర్యవేక్షిస్తున్నారు.

బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 25న క్రిస్మస్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలోని సహోద్యోగులను విందు నిమిత్తం వీఆర్ఏ తన ఇంటికి ఆహ్వానించింది. సిబ్బంది అందరూ వెళ్లగా, వరకుమార్ మాత్రం వెళ్లలేదు. గత శనివారం నాడు, తాను విందుకు రాలేదని గుర్తు చేసిన ఆయన, ఒంటరిగా విందు ఇవ్వాలని కోరారు. విందులో కోడికూరతో పాటు నువ్వూ కావాలని చెప్పాడట. తండ్రి వంటి వారు ఇలా అనడం సరికాదని ఆమె చెబుతున్నా వినకుండా, వెనక నుంచి వచ్చి కౌగిలించుకుని అసభ్యకరంగా మాట్లాడారని ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కాగా, తనపై వీఆర్ఏ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వరకుమార్ వివరణ ఇచ్చారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను తేల్చాలని డిమాండ్ చేయడం గమనార్హం.

More Telugu News