Kanna Lakshminarayana: ఏ రాయి అయితేనేమి పళ్లు రాలకొట్టుకోవడానికి?: కన్నా లక్ష్మీనారాయణ

  • కమిటీల పేరుతో సమయం, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు
  • జగన్ మనసులో ఉన్నదే నివేదికల్లో ఉంటుంది
  • ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అత్యంత విలువైన సమయాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీ, రేపు హైపవర్ కమిటీ అంటూ సమయం, ధనం వృథా చేస్తున్నారని అన్నారు.

కమిటీ పేరు ఏదైనాసరే... జగన్ మనసులో ఉన్నదే నివేదికలో ఉంటుందని చెప్పారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నివేదికలను ఇస్తూ, గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నాతో పాటు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని... ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని చెబుతున్నారు.

More Telugu News